జైల్లోనే జగన్ ఎన్నికల కసరత్తు: అభ్యర్థుల గుర్తింపు

రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, రాష్ట్ర విభజన జరిగినా విజయం తమ పార్టీదేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. రెండు ప్రాంతాల్లోనూ తమదే మెజారిటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విభజన జరిగితే రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన ఇతర పార్టీల నాయకులు పెద్ద యెత్తున తమ పార్టీలోకి వస్తారని అంటున్నారు. విభజన జరగకపోయినా తెలంగాణలో తగిన స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందని, తెలంగాణలో వైయస్సార్ అభిమానులు చాలా మంది ఉన్నారని, వారంతా తమ పార్టీని గెలిపిస్తారని వారంటున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు వైయస్ జగన్తో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. అలాగే హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు బలంగా తయారవుతుందని ఆశపడుతున్నారు. హైదరాబాద్లో 23 శాసనసభా నియోజకవర్గాలున్నాయి. తెలంగాణవాదం బలంగా లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా నాయకులు తమ పార్టీలోకి వస్తారని, ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేస్తారని వారు చెబుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ బిసీ డిక్లరేషన్ను ఎదుర్కోవడానికి వంద మందికి పైగా బిసీ అభ్యర్థులను శాసనసభ ఎన్నికల్లో నిలబెట్టాలనే ఆలోచన కూడా జగన్కు ఉన్నట్లు సమాచారం. పారిశ్రామికవేత్తలకు, కొత్త ముఖలాకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
సర్వేలు నిర్వహించిన సంస్థల నుంచి బలమైన అభ్యర్థుల జాబితాను జగన్ ఇప్పటికే తెప్పించుకున్నట్లు సమాచారం. సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలను బరిలోకి దింపడానికి ఆయన కసరత్తు చేస్తున్నారని వినికిడి. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు. ములాఖత్ల ద్వారా తనను కలుస్తున్న అనుచరులతో జగన్ జైలులో తన అభిప్రాయాలను పంచుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications