గతంలోనే లేఖ ఇచ్చాం: తెలంగాణపై చంద్రబాబు
మళ్లీ ఐఎంజి భూముల కేటాయింపు వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కయి కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడబోదని ఆయన అన్నారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని ఆయన అన్నారు. తన పాదయాత్రను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. తమ ప్రభుత్వ హయాంలో ఢిల్లీని బెదిరించి నిధులను తెచ్చుకునేవాళ్లమని ఆయన అన్నారు. ప్రస్తుతం అసమర్థ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. పాదయాత్రకు ముందే తెలంగాణపై వైఖరిని ప్రకటించాలని ఆయన అన్నారు. పాదయాత్ర పేరు గురించి, డైలాగుల గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. 86 శాతం మంది ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బ తీసే ఆలోచన తెలంగాణ ఉద్యమకారులకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్కు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.