కాంగ్లో విలీనం: టిఆర్ఎస్కు చిరంజీవి పిఆర్పీతో పోలిక
ఇప్పటికే పలువురు నేతలు కెసిఆర్ ను కాంగ్రెసు పార్టీ పిలవలేదని, ఆయన వచ్చారని చెబుతున్నారు. బిజెపి, జగన్ ఎఫెక్ట్ కారణంగా కెసిఆర్ కాంగ్రెసుతో విలీనం కోసం తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తోంది, ఇప్పటి వరకు తెలంగాణలో కెసిఆర్ ప్రభావం చూపారనీ, ఈ మధ్య ఉద్యమంలోకి కొత్త పార్టీలు, కొత్తగా పుట్టుకు వచ్చి పార్టీ నేపథ్యంలో కెసిఆర్ ఇక తన ఆటలు సాగవని భావించి విలీన ప్రతిపాదనకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండవచ్చునని చెబుతున్నారు.
కెసిఆర్ ఇరవై రోజులుగా ఉంటున్నప్పటికీ తమ పార్టీ ముఖ్యనేతల అపాయింటు పొందలేక పోయారని, అయినా ఆయన తన ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. అధిష్టానం ఇప్పట్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోదని, కెసిఆర్ ఢిల్లీలో ఉండటం వల్ల తమకు ఎలాంటి భయం లేదని కూడా సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. కెసిఆర్ విలీన ప్రతిపాదన, ఆ తర్వాత పరిణామాలపై సీమాంధ్ర నేతలు లెక్కలు వేసుకుంటున్నారట.
తెలంగాణ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్, టిఆర్ఎస్ సంయుక్త బలంతో 17కు 17 లోక్సభ సీట్లూ గెలవొచ్చంటూ ఆయన ఊరిస్తున్నా.. వాస్తవంగా అది జరిగే పని కాదన్నది సీమాంధ్ర నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీ జరిగినప్పుడు కూడా సీమాంధ్రలో ఎంతో లబ్ధి ఉంటుందని భావించినప్పటికీ.. కోస్తాలో విలీన ప్రభావం పెద్దగా లేదని చెబుతున్నారు. టిఆర్ఎస్ కలిసినా అంతే జరుగుతుందని, అద్భుతాలేమీ జరగవని భావిస్తున్నారు.
సెంటిమెంట్ తప్ప తెరాసకు తెలంగాణలో బలం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో దాని పని తీరు తెలిసిందని, ఉప ఎన్నికల్లో సైతం ఇప్పుడు మార్పొచ్చిందని భావిస్తున్నారు. మహబూబ్నగర్లో ఓటమి పాలైతే పరకాలలో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా బతికి బట్టకట్టిందని అంటున్నారు. టిఆర్ఎస్ నిజంగానే కాంగ్రెస్లో విలీనమైనా.. కెసిఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గం నాయకులు ఒప్పుకునే అవకాశం లేదని, ఇన్నాళ్లూ తెలంగాణలో బలమైన నాయకుడిగా ప్రచారం పొందిన కెసిఆర్ కాంగ్రెస్లోకి రాగానే క్రియాశీలక నేతగా లేకుండా ఉండగల్గుతారా అని ప్రశ్నిస్తున్నారు.
పైగా కెసిఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఆయన కుటుంబం, పార్టీ కేడర్ అంతా కాంగ్రెస్లోకి వస్తారన్న గ్యారెంటీ లేదని భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లో తెరాస చాలా బలహీనంగా ఉందని, ఖమ్మంలో ఆ పార్టీ ఉనికే అంతంతమాత్రమని వీరు గుర్తు చేస్తున్నారు. కేవలం మూడు, నాలుగు జిల్లాలోనే తెరాస బలంగా ఉన్నదని, అలాంటి పార్టీని విలీనం చేస్తానని కెసిఆర్ చెబితే దానిని నమ్మి రాష్ట్రాన్ని చీల్చడం సరికాదని సీమాంధ్ర నాయకులు వాదిస్తున్నారు.