మార్చ్పై తెరాస దూకుడు: ప్రతికూల సంకేతాల వల్లే
తెలంగాణ రాదంటూ సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని తెరాస నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ నెలాఖరులోగా ప్రకటన చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రకటిస్తే సంబరాలు, లేదంటే సమరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలంగాణ జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేస్తే ఈ నెల 30వ తేదీన తెలంగాణ మార్చ్ను తాము ముందుండి నడిపిస్తామని తెరాస శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ జెఎసి నేతలు అరెస్టయినా కాకున్నా పార్టీ శ్రేణులన్నీ పాల్గొనడం ద్వారా కవాతును విజయవంతం చేస్తామని ఆనయ చెప్పారు.
తెలంగాణ కోసం సాగిస్తున్న ఉద్యమం, రాజకీయ ప్రయత్నాలు చివరి అంకానికి చేరుకున్నాయని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 30వ తేదీలోపు తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే ప్రపంచ చరిత్రలోనే కనివినీ ఎరుగుని రీతిలో ఈజిప్టు ఉద్యమాన్ని తలదన్నే విధంగా సాగర హారాన్ని చేపడుతామని ఆయన చెప్పారు.
తెలంగాణ కవాతును విజయవంతం చేయాలని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ కవాతును స్వేచ్ఛగా నిర్వహించుకోవానివ్వాలని, నగరంలోకి వాహనాలను అనుమతించాలని ఆయన అన్నారు. అరెస్టులు, అణచివేత చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఇంటికొకరు తెలంగాణ జెండా పట్టుకుని కవాతులో పాల్గొనాలని ఆయన కోరారు. కవాతుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ కవాతును వాయిదా వేసే ప్రసక్తే లేదని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు మంగళవారం వరంగల్లో అన్నారు. ఆ రోజు కవాతు జరిగి తీరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామంటే తీసుకుంటాం, లేదంటే పోరాడి సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు కవాతుకు అనుమతి అయినా తీసుకుని రావాలి, లేదంటే కవాతులోనైనా పాల్గొనాలని ఆయన అన్నారు.