'మహా' డిప్యూటీ సిఎం అజిత్ పవార్ రాజీనామా
తాను అవినీతికి పాల్పడలేదని అజిత్ పవార్ అన్నారు. పదవికి తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయితే, అదనంగా 0.1 శాతం ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు.
శ్వేతపత్రం విడుదల చేస్తే తనకేమీ అభ్యంతరం లేదని, తన రాజీనామా లేఖను పంపించానని, ఒత్తిడి ఏమీ లేదని ఆయన అన్నారు. ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తాను ఇక నుంచి పార్టీ కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. ఇరిగేషన్ కుంభకోణం 7.20 లక్షల రూపాయలు ఉంటుందని అంటున్నారు. మంత్రి పదవి రాజీనామా చేసినప్పటికీ అజిత్ పవార్ ఎన్సీపి శానససభా పక్ష నేతగా కొనసాగుతారు. అజిత్ పవార్ తనకు చెప్పే రాజీనామా చేశారని ఎన్సీపి అధినేత శరద్ పవార్ అన్నారు. తమ పార్టీ మంత్రులు రాజీనామా చేయబోరని, ప్రభుత్వంలో తమ పార్టీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ఆయన అన్నారు.