కాంగ్రెసు నేత పిన్నమనేని కోటేశ్వర రావు మృతి
నలుగురు కుమారులలో పిన్నమనేని వెంకటేశ్వరరావు తండ్రి అడుగుజాడల్లో నాయకునిగా ఎదిగి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మృతివార్త తెలుసుకొని జిల్లా నలుమూలల నుంచి రాజకీయ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రి పార్థసారథి, ఎంపీలు రాయపాటి, కొనకళ్ల నారాయణ, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్ పేర్ని నాని తదితరులు కోటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.
పరిణతి చెందిన రాజకీయాలకు నిలయమైన కృష్ణా జిల్లాకు 27 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా పనిచేయడం చిన్న విషయమేమీ. అదీ అవినీతి మకిలి అంటకుండా, అందరివాడుగా పేరు సంపాదించుకున్నారు. అందువల్లనే ఇప్పటికీ జిల్లా ప్రజలు పిన్నమనేని కోటేశ్వరరావును 'చైర్మన్'గానే వ్యవహరించి గౌరవిస్తారు. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలను జీవితంలో భాగం చేసుకున్నారు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలతో స్ఫూర్తి పొంది దాన్ని రాజకీయాల్లో ఆచరించేందుకు యత్నించారు.
పుస్తక పఠనాన్నీ వదలలేదు. ఇంటి సొమ్మునే సేవకు వినియోగించి ప్రజల మన్ననలు అందుకున్నారు. తండ్రి నుంచి సంక్రమించిన 425 ఎకరాల ఫలసాయాన్ని పార్టీ, ప్రజల కోసం ఖర్చుచేశారు. తనలాగే, తన కుమారులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. రుద్రపాకలో తల్లిదండ్రుల పేరిట వైద్యశాలలు, విద్యాలయాలు స్థాపించారు.
కోటేశ్వరరావు మృతిపట్ల సీఎం కిరణ్ సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీకీ, జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. జడ్పీ ఛైర్మన్గా సుదీర్ఘంగా సేవలనందించిన కోటేశ్వరరావు స్ఫూర్తి మరువలేనిదని టీడీపీ అధినేత చంద్రబాబు పే ర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కోటేశ్వరరావు ఎప్పుడూ ముందుండేవారని పీసీసీ చీఫ్ బొత్స నివాళి అర్పించారు. అవినీతి ఆరోపణలు లేకుండా పాలించిన ఘనత కోటేశ్వరరావుకే దక్కుతుందని ఎంపీ హరికృష్ణ శ్లాఘించారు. "స్థానిక ప్రభుత్వాల సాధికారత పోరాటానికి పిన్నమనేని మృతి పెద్ద లోటు'' అని లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు.