బాబు ఆలోచన: నగదు బదలీపై చిరంజీవికి రేవంత్ ప్రశ్న
చంద్రబాబు ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తారని చెప్పడానికి తాజాగా దేశంలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పెట్టారని, దీనిని అమలు చేయడానికి ఏటా రూ.40 వేల కోట్లు కావాలని, కరెన్సీ నోట్లు అచ్చుకొట్టి పంచిపెడితే తప్ప సాధ్యం కాదని నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, ఇది బోగస్ పథకమని వయలార్ రవి ఆరోపించారని గుర్తు చేశారు.
స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు తెస్తారా లేక సొంతంగా ముద్రిస్తారా అని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఎద్దేవా చేశారని, ఇప్పుడు ప్రధాని కూడా ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నోట్లు ముద్రిస్తారా చెప్పాలని వయలార్ రవి, చిరంజీవిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఈ పథకాన్ని విమర్శించారని, చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి కూడా మార్గదర్శకునిగా నిరూపితమయ్యారని చెప్పారు. తెలుగుదేశం తన హయాంలో ఎన్నో వినూత్న ఆలోచనలతో పరిపాలనా రంగాన్ని సంస్కరించిందన్నారు.
దానిలో భాగంగానే దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి నగదు బదిలీని ప్రతిపాదించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిండా దళారులు కిటకిటలాడుతున్నారని, ఏ పథకం పెట్టినా వారి మేతకే చాలడం లేదని, దళారుల ప్రమేయం తగ్గిస్తామంటే భయపడిపోయి నగదు బదిలీని వ్యతిరేకించారని ఆరోపించారు. ఇప్పుడు ప్రధాని తానే పెడతామనేసరికి వారికి నోరు పెగలడం లేదన్నారు.