ఢిల్లీ వెళ్తాం: జానా, పిఎంగా రాహుల్ కష్టమే... ఎంపీలు
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థుల వలే తాను కూడా తెలంగాణనే కోరుకుంటున్నానని చెప్పారు. తన రాజీనామా కోరే హక్కు ఎవరికీ లేదన్నారు. రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే అందుకు సిద్ధమే అన్నారు. కాగా జానా రెడ్డి ఒక్కరోజులో మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. ఆదివారం తెలంగాణ కవాతుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంటూ.. ఆయన తాము పదవులు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న వ్యాఖ్యలు చేశారు. కానీ సోమవారం మాత్రం రాజీనామాలతో తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కష్టమే
తెలంగాణలో పరిస్థితులు ఇలాగే ఉంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం కష్టమేనని తెలంగాణ ప్రాంత ఎంపీలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఎంపీలు తొలుత కె కేశవరావు ఇంట్లో, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలన్న ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ న్యాయమైనదేనని వారు అన్నారు.
రాష్ట్ర విభజన బాధ్యత మంత్రులదే అన్నారు. తెలంగాణను కోరుతూ అధిష్టానానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఓ లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ ఉనికి తెలంగాణలో కష్టమే అని వారు అన్నారు. రోజు రోజుకు ప్రభుత్వంపై గౌరవం తగ్గిపోతోందన్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివ రావుల తీరు బాగా లేదని చెప్పారు.