తెలంగాణ: దామోదర, జానాలపై పెరుగుతున్న ఒత్తిడి
తెలంగాణ మార్చ్ విజయవంతమైన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు తమ దృష్టిని తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ అంశంపై డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రాజీనామా చేస్తే నైతికంగా ఉద్యమానికి ఎనలేని నైతికబలం చేకూరుతుందని భావిస్తున్నారు. జానారెడ్డి, తదితర మంత్రులు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై, కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.
నిజానికి, తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఉద్దేశంతో దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారు. జానారెడ్డికి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే కోరిక మదిలో మెదులుతోంది. ఈ రకంగా ఈ ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు. అయితే, వారి అసంతృప్తిని తెలంగాణవాదులు తమ ఉద్యమానికి ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
దామోదర, జానారెడ్డి రాజీనామాలు చేయడానికి సిద్ధపడితే మిగతా మంత్రుల్లో కొందరు కూడా ముందుకు వస్తారని, శాసనసభ్యులు కూడా కొంత మంది ఈ దిశగా ఆలోచన చేస్తారని తెలంగాణ ఉద్యమకారులు అంచనాలు వేస్తున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు సోమవారం మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.
తెలంగాణ కవాతు వంటి కార్యక్రమాలను భవిష్యత్తులో తక్కువగా వాడాలని, తెలంగాణ మంత్రుల చేత రాజీనామాలు చేయించే దిశగానే పనిచేయాలని తెలంగాణ జెఎసి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలోనే జానారెడ్డి ఒయు జెఎసిపై, రాజకీయ జెఎసిపై మండిపడ్డారని అంటున్నారు. తెలంగాణ జెఎసిని ఏర్పాటు చేసింది తానే అని, తన రాజీనామాను డిమాండ్ చేసే హక్కు వారికి లేదని జానారెడ్డి ఘాటుగా స్పందించారు.
అయితే, తెలంగాణ మార్చ్ ప్రభావం మాత్రం తెలంగాణ మంత్రులపై తీవ్రంగానే పడిందని చెప్పాలి. పోలీసులు అడ్డంకులు కల్పించి, కవాతుకు వచ్చేవారిని తగ్గించగలిగారే గానీ దాన్ని విఫలం చేయలేకపోయారని అంటున్నారు. దాదాపు రెండు లక్షల మంది కవాతుకు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. పోలీసులు ఆటంకాలు కల్పించకపోతే మరిన్ని లక్షల మంది కవాతులో ఉండేవారని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ మంత్రులు ఉక్కిరి బిక్కిరి అయ్యే వాతావరణమే ఉందని అంటున్నారు.