జగన్ దెబ్బకి బాబు మైండ్బ్లాక్, అందుకే: వాసిరెడ్డి పద్మ
కాంగ్రెసుతో తమ పార్టీ కుమ్మక్కయ్యారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కిరణ్ సర్కారుకు అండగా నిలుచుంది టిడిపియే అన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలందరికీ తెలుసునని, సర్కారును కూల్చనని ప్రకటించిన ఘనత బాబుది అన్నారు. ఎమ్మార్, ఐఎంజి కుంభకోణాలకు పాల్పడ్డా అతనిపై ఏ కేసులు లేవన్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కుకు ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని ప్రశ్నించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వివాదాస్పద జివోలతో సంబంధం లేకున్నప్పటికీ అరెస్టు చేసి జైలు పాలు చేశారని ఆరోపించారు. జగన్ కాంగ్రెసులో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. తమ పార్టీలోకి వస్తున్న క్యాడర్ను కాపాడుకునేందుకే బాబు పాదయాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు.
పాదయాత్రతో కాళ్ల నొప్పులు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళ్లు వాచిపోయే రోజులు కూడా వస్తాయని విమర్శించారు. అధికార పార్టీతో మూడేళ్లుగా బాబు అంటకాగుతున్నారన్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం బాబు చేతిలే పని అన్నారు. కేంద్రంలో కాంగ్రెసు సారథ్యంలోని యూపిఏ ప్రభుత్వంపై కూడా మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగే పని కాదని, అందుకు ములాయం సింగ్ మద్దతివ్వరని, కాబట్టి లోకసభ ముందస్తు ఎన్నికలు రావని కూడా బాబు చెప్పారన్నారు.
పిల్ల కాంగ్రెసు అంటున్న బాబు మొన్నటి ఉప ఎన్నికల్లో ఆ పిల్ల కాంగ్రెసు చేతిలోనే డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోయిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. జగన్ కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి పిచ్చిగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. పార్టీని రక్షించుకోవడానికే పాదయాత్ర అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 63 ఏళ్ల వయస్సులో వస్తున్నా మీకసం అంటూ త్యాగం చేస్తున్నట్లు ఫోజు కొడుతున్నారని దుయ్యబట్టారు.