సిఎంపై హక్కుల నోటీసు ఇస్తాం: స్పీకర్కు టి-ఎంపీలు
సొంత పార్టీ సిఎంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయడం బహుశా దేశంలో ఇదే తొలిసారి అని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లేఖతో సిఎంకు.. టి ఎంపీలకు మధ్య ఉన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ లేఖలో.. తెలంగాణ మార్చ్ సందర్భంగా విధ్వంసక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసే ఉంటుందని.. కానీ ప్రభుత్వం ముందస్తుగా విషయం గ్రహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
పరిస్థితిని గ్రహించిన తాము మార్చ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా కాంగ్రెస్ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్.రాజయ్య తదితరులు సీఎంను సంప్రదించేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లామని.. సిఎంను కలిసి పరిస్థితిని వివరించి.. ప్రజల హక్కులను కాపాడే ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే.. ఆయన తమ ప్రాథమిక విధులను నిర్వర్తించకుండా నిరోధించారని ఆరోపించారు. అరెస్టు చేసిన కార్యకర్తలు మార్చ్లో పాల్గొనేలా వారిని విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, అరెస్టుల పర్వం కొనసాగించి విశ్వాసఘాతుకానికి పాల్పడిందని పేర్కొన్నారు.
బస్సులతో పాటు 27 రైళ్లను అడ్డుకుని సామాన్య ప్రయాణికులకు అసౌకర్యం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీలకు హోం మంత్రి ఆదేశాలు జారీచేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ అంశాన్ని నేరుగా సీఎం పర్యవేక్షిస్తున్నందున తామేమీ చేయలేమంటూ జిల్లా ఎస్పీలు హోంమంత్రికి స్పష్టం చేశారని అన్నారు. తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో సీఎం వ్యవహరించినందున దీన్ని ప్రత్యేక అంశంగా గుర్తించి ప్రాధాన్యం ఇచ్చి తగు చర్య తీసుకోవాలని కోరారు.