బాబు అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరుగుతుంది: సిఎం
ప్రకాశం జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో చెప్పారు. రాష్ట్రంలో అందరికంటే అవినీతిపరులైన ముఖ్యమంత్రులలో చంద్రబాబు ఒకరని, త్వరలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన మీద సిబిఐ విచారణ మొదలు కాబోతోందని వెల్లడించారు.
ఎకరా కోటి రూపాయల విలువైన భూమిని రూ. 50 వేల చొప్పున 450 ఎకరాలను ఐఎంజీకి చంద్రబాబు కట్టబెట్టారని, ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు త్వరలో సీబీఐ దర్యాప్తు జరగబోతోందని చెప్పారు. "కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరగబోతా ఉంది. చంద్రబాబు కేసును కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తీసుకోబోతోంది. అది నేను కూడా చూడటం జరుగుతుంది'' అని ఆయన అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు దీనిపై స్పందించారు. "ఒక పక్క కోర్టులో వాదనలు జరుగుతున్న కేసులో ఏం జరగబోతోందో ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆయనేమైనా న్యాయమూర్తా? తీర్పులు కూడా ఆయనే ఇస్తారా? చంద్రబాబు పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి కళ్లు బైర్లు కమ్మి... బెంబేలెత్తి ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు'' అని ఎర్రన్నాయుడు ధ్వజమెత్తారు.
చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించాలని సోనియా కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్ విపరీతమైన ప్రయత్నాల్లో ఉన్నాయని, దానిలో భాగంగానే కిరణ్ ఈ ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఐఎంజీ భూకేటాయింపుల్లో చంద్రబాబుపై సీఎం కిరణ్ విమర్శలు చేయడం సిగ్గుచేటని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.
కోర్టు విచారణలో ఉన్న అంశంపై తప్పు జరిగిందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. సీఎం ఏమైనా జడ్జితో మాట్లాడారా..? న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి పదవి చేపట్టకుండానే ముఖ్యమంత్రి అయిన ఆయన ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలను తాము సీరియస్గా తీసుకోవట్లేదన్నారు.
తప్పు చేయనంతవరకు ఏ ఒక్కరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కోడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కోర్టు నిర్ణయం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.