షర్మిల పవర్ సెంటర్గా మారితే..? తప్పనిసరై
రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఆమె తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి ఎప్పుడు బయటకు వస్తారో ఖచ్చితంగా తెలియదు. గత శుక్రవారం సుప్రీం కోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని పార్టీ క్యాడర్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ చుక్కెదురయింది. అంతేకాదు వచ్చే సంవత్సరం మార్చి ఆఖరు వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని సుప్రీం సూచించింది. దీంతో జగన్కు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
అదే సమయంలో మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో జగన్ పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే జగన్ లేరు. కాబట్టి ఎవరో ఒకరు పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో షర్మిలను ముందుకు తీసుకు వచ్చారు. విజయమ్మతో పాదయాత్ర వంటి కార్యక్రమాలు చేయించేందుకు వీలుకాదు. తప్పని పరిస్థితుల్లో షర్మిలను తీసుకు వచ్చారు.
అయితే జగన్ జైలు నుండి విడుదలయ్యేలోపు షర్మిల పార్టీలో మరో పవర్ సెంటర్గా మారనున్నారా అనే టాపిక్ పార్టీలోను, రాజకీయ వర్గాల్లోని హాట్ హాట్గా మారిందట. జగన్ లేకపోవడం, విజయమ్మకు సాధ్యం కాకపోవడం, భారతి రెడ్డి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న నేపథ్యంలోనే షర్మిలను పార్టీ పరంగా ముందుకు తీసుకు వచ్చినట్లు ఆ పార్టీ నాయకులు కూడా చెబుతున్నారని సమాచారం.
తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వలె హావభావాలు ప్రదర్శిస్తున్న షర్మిల బాగా ఆకట్టుకుంటున్నారు. ఆమె వాక్చాతుర్యం విపక్ష నేతలను కూడా ముగ్ధులను చేస్తోంది. అది ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ద్వారా రుజువైంది. విజయమ్మ ప్రధానంగా ప్రచారంలోకి వెళ్లినప్పటికీ అందర్నీ ఆకట్టుకున్నది మాత్రం షర్మిలనే. వైయస్లా ఆమె హావభావాలు ప్రదర్శించడం, వాక్చాతుర్యం కలిగి ఉండటం ఆమెకు బాగా కలిసి వస్తోంది. పార్టీలోనూ అందరితో కలివిడిగా మాట్లాడతారట.
ఇప్పటికే షర్మిల పేరు పార్టీలోనూ, ప్రజల్లోనూ బాగా నానింది. జగన్ విడుదలయ్యే వరకు కూడా షర్మిలనే పార్టీని లీడ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరో పవర్ సెంటర్గా మారితే ఎలా అనే ఆందోళన పార్టీని వేధిస్తోందని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, జగన్ జైలు నుండి బయటకు వచ్చాక షర్మిల ఎప్పటిలాగే ఇంటికి పరిమితం అవుతారని మరికొందరు చెబుతున్నారు. జగన్ బయటకు రాగానే మొదట షర్మిలనే ఇంటికి పరిమితం అవుతారని చెబుతున్నారట.