షర్మిల పాదయాత్రలో ఏం చెబుతారు? వాద్రా ప్రస్తావన..

Sharmila
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రకు ధీటుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. బాబు 2,200 కిలోమీటర్ల యాత్ర చేస్తే షర్మిల 3వేల కిలోమీటర్లు చేయనుంది. ఈ పాదయాత్ర జగన్ చేద్దామనే భావించారని, కానీ అతను జైలుకు వెళ్లడం వల్ల షర్మిల చేస్తున్నారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రకటించారు.

ఇప్పటికే షర్మిల ఉప ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకున్నారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హావభావాలతో మంచి వాక్చాతుర్యం కలిగిన షర్మిలను చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్నాళ్లూ సెంటిమెంట్ పైన నడిచిన వైయస్సార్ పార్టీకి ఇక నుండి అది పని చేయకపోవచ్చు. దాంతో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరముంది. ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమైన షర్మిల తన పాదయాత్రలో ఏం చెబుతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

చంద్రబాబు టార్గెట్

షర్మిల తన పాదయాత్రలో టిడిపిని, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడినే ప్రధానంగా టార్గెట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అధికారంలో కాంగ్రెసు పార్టీ ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. రెండేళ్లుగా టిడిపి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు క్రమంగా కుదురుకుంటోంది. చంద్రబాబు యాత్ర కూడా తమ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే.

దీంతో టిడిపి క్రమంగా బలపడకుండా ఉండేందుకు ఆ పార్టీనే టార్గెట్ చేసుకునే విధంగా షర్మిల యాత్ర ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. అసలు షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్ర చేపట్టడానికి కారణమే టిడిపి అధినేత పాదయాత్ర. దీంతో బాబు పాదయాత్రకు ధీటుగా ఉండటమే కాకుండా ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని చెప్పడమే షర్మిల ప్రధాన ఉద్దేశ్యం. బాబు తన యాత్రలో తన పాలన గురించి పలుమార్లు చెబుతున్నారు.

షర్మిల అందుకు వ్యతిరేకంగా బాబు చేసిందేమీ లేదని చెప్పనున్నారు. అంతేకాకుండా ఆయన కాలంలో జరిగిన రైతులపై కాల్పులు, కరవు, పెంచిన ధరలు తదితరాలను ఆమె ప్రస్తావించనున్నారు. కిరణ్ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టక పోవడాన్ని కూడా ఆమె ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కు వల్లే జగన్ జైలుకు వెళ్లారని చెబుతారు. గత ఉప ఎన్నికలలోనూ వారు కుమ్మక్కు ఆరోపణలు చేశారు. వీటికి ఈసారి మరింత పదును పూయనున్నారు.

వైయస్ పథకాలు

కాంగ్రెసు లక్ష్యంగా షర్మిల దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను ప్రస్తావించి, ఏఏ పథకాలను ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది, కొన్నింటిని అమలు చేస్తున్నప్పటికీ ఎలా అమలు చేస్తుందనే వాటిని ప్రజలకు వివరించనున్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్, విద్యుత్ ఛార్జీలు, వ్యవసాయం, గ్యాస్ తదితర సమస్యలను ప్రజల ముందుకు తీసుకు వెళతారు. వైయస్ హయాంలో కేంద్రం గ్యాస్ పై రూ.50 పెంచితే వైయస్ దానికి సబ్సిడీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా చేయడం లేదు. దీనిని చెప్పనున్నారు.

రాబర్ట్ వాద్రాను లాగుతారా?

షర్మిల తన యాత్రలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అంశాన్ని ప్రస్తావిస్తారా అనే అంశం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాంటి ఆరోపణలే ఇప్పుడు వాద్రా పైన వచ్చాయి. పెట్టుబడుల విషయాన్ని ప్రస్తావించి జగన్‌కు అన్యాయం జరిగిందని, అదే వాద్రాను కాంగ్రెసు వెనుకేసుకొస్తుందని చెప్పనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+