ఫ్యామిలీలో ఎవరో తేల్చుకునేందుకే షర్మిలయాత్ర: బొత్స
అమాయక రైతులను ఉత్తుత్తి హమీలతో మోసం చేసే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు చేసేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు. రైతులకు ఎంత రుణమాఫీ చేస్తారో బాబు చెప్పాలన్నారు. జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేయడం ప్రజలు తమను మరిచిపోకుండా ఉండేందుకే అన్నారు. వైయస్ కుటుంబంలో ఎవరు ఎక్కువ అని తేల్చుకునేందుకే షర్మిల ఈ యాత్రకు సిద్ధపడ్డారన్నారు.
తెలంగాణపై వక్రీకరణ వద్దు
తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని బొత్స సూచించారు. తెలంగాణకు అనుకూలమని చెప్పి రెండో ఎస్సార్సీని పార్టీ ముసాయిదాలో చేర్చామని బొత్స చెప్పారు. కేంద్రం త్వరలో తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. విభజనపై ఏకాభిప్రాయం అవసరం లేదన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.
కాంగ్రెసు సభ్యత్వ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ సభ్యత్వ నమోదును ఈ నెల 18వ తేది నుండి ప్రారంభిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోని ముఖ్య నేతలు అందరూ పాల్గొంటారన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు.