ఫేస్ టు ఫేస్: జగన్ సోదరి షర్మిలతో నారా లోకేష్ ఢీ?

ఇటీవల సుప్రీం కోర్టులో జగన్కు చుక్కెదురయింది. సిబిఐకి విచారణపై గడువు విధించిన సుప్రీం కోర్టు ఆ గడువు వరకు బెయిల్ కోరవద్దని జగన్ను ఆదేశించింది. దీంతో మరో ఐదారు నెలల వరకు జగన్కు బెయిల్ పైన ఆశలు సన్నగిల్లినట్లే. ఆ కారణంగానే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. బెయిల్ వస్తుందనే నమ్మకముంటే అతనే ఓదార్పు యాత్రనో మరొకటో చేసే వారని చెబుతున్నారు.
బెయిల్ రాదనే విషయం తెలియబట్టే తెలుగుదేశం, కాంగ్రెసుకు ధీటుగా సాధారణ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి తప్పని పరిస్థితుల్లో షర్మిలను పాదయాత్రకు పంపిస్తున్నారనే వార్తలు వచ్చాయి. పార్టీ వ్యవహారాలు అన్నీ విజయమ్మ చేతులమీదుగా నడుస్తున్నప్పటికీ వాటి వెనుక షర్మిల ఉందని చెబుతున్నారు. జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీ పటిష్టత కోసమంటూ వచ్చిన షర్మిల క్రమంగా పట్టు పెంచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు కౌంటర్గా షర్మిల మరో ప్రజా ప్రస్థానానికి సిద్ధమయ్యారు. 2014లో చంద్రబాబే టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పటికీ ప్రచార బాధ్యతలు, అభ్యర్థుల ఎంపిక తదితరాలు అన్నింటిని బాబు తనయుడు లోకేష్, బావమరిది నందమూరి బాలకృష్ణ చూసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాలయ్య, లోకేష్ తాము రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు.
సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరంన్నర మాత్రమే ఉన్నందున బాబు యాత్ర ముగిసేలోగా లోకేష్, బాలయ్య రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి మాటల్లో కూడా అది కనిపిస్తోంది. అప్పుడు బాబుతో పాటు బాలయ్య, లోకేష్లు పార్టీలో కీలకంగా మారుతారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల హడావుడి మరో ఆరేడు నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే పాదయాత్రల వేడితో ఇప్పటికే నేతలు ఆ హడావుడిని తలపిస్తున్నారని చెప్పవచ్చు.
2014 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు టిడిపి తరఫున లోకేష్, బాలకృష్ణలు ఉండగా.. వైయస్సార్ కాంగ్రెసు తరఫున షర్మిల, జగన్ ఉన్నారు. అయితే షర్మిల ఒక్కరే ఉన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ అప్పటికీ ఇంకా అక్రమాస్తుల కేసులో బెయిల్ కోసం, విచారణ కోసం అంటూ అటు వైపు సమయం కేటాయిస్తే షర్మిల ఒక్కరే మరికొన్నాళ్లూ పార్టీని తన భుజస్కందాలపై వేసుకోవడం తప్పదని చెబుతున్నారు.
టిడిపిని లోకేష్, బాలయ్య జగన్ పార్టీని షర్మిల 2014 ఎన్నికల వైపు నడిపిస్తారని చెబుతున్నారు. టిడిపిలో బాలకృష్ణ క్రౌడ్ పుల్లర్, లోకేష్ స్పెషల్ అట్రాక్షన్, వీరిద్దరి కోసం ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు పట్టుబడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో జగన్ క్రౌడ్ పుల్లర్ కాగా షర్మిల తన తండ్రి హావభావాలతో ప్రజలకను ఆకట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications