విదేశాల్లో నరేంద్ర మోడీ గాలి: ఆందోళనలో కాంగ్రెస్
సీట్లు రావడంలో బిజెపికి కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వమే మళ్లీ ఏర్పడుతుందని అంతర్జాతీయవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు. దీంతో పలు దేశాల్లో మోడీ గాలి వీస్తోంది. గుజరాత్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు పశ్చిమ దేశాలు క్యూ కడుతున్నాయి. విదేశాల్లో కూడా మోడీ గెలుపు పైనే నమ్మకం ఉండటంతో కాంగ్రెసుకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. 2002 మత కలహాల తర్వాత పదేళ్లుగా మోడి పట్ల వెలివేత వైఖరిని అనుసరిస్తున్న బ్రిటన్ సైతం తాజాగా మోడీతే సంబంధాలు పునరుద్ధరించుకోనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీలోని తమ రాయబారిని గాంధీనగర్ వెళ్లి మోడీని కలవాలని బ్రిటన్ ఆదేశించింది. మోడీకి వీసా నిరాకరించిన అమెరికా కూడా ఇప్పుడు పునరాలోచనలో పడింది. గుజరాత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో ఒక్కటని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. గుజరాత్లో తమ కంపెనీలు ఉండటం తమకే ఎక్కువ లాభమని జర్మనీ రాయబారి ఓ సందర్భంలో చెప్పారు. మోడీ పైన ఆంక్షలు ఎత్తివేసే విషయమై మాట్లాడకపోయినప్పటికీ క్రమంగా పశ్చిమ దేశాల్లో ఆయన పట్ల మార్పు కనిపిస్తోంది. మోడీకి భారతీయ ఓటర్ల కన్నా విదేశాల ఆమోదమే ఎక్కువగా ఉందని కాంగ్రెసు ఎద్దేవా చేయడం గమనార్హం.