నిన్న జగన్ ఓదార్పు.. నేడు షర్మిల పాదయాత్రపై ఆరా
ఇప్పుడు కాంగ్రెసు పెద్దలు షర్మిల యాత్ర గురించి ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలతో పాటు షర్మిల యాత్ర గురించి కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెసు ప్రస్తుత పరిస్థితిపై వారు ఆరా తీశారు. తెలంగాణ, జగన్ ప్రభావాలు ఎలా ఉన్నాయో కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారని సమాచారం. జగన్ అరెస్టు తర్వాత షర్మిల ఉప ఎన్నికల ప్రచారంలో తన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో పాటు పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వారు కిరణ్తో పాటు పలువురు రాష్ట్ర నేతల నుండి అడిగి తెలుసుకుంటున్నాట్లుగా సమాచారం.
రేపటి నుండి షర్మిల చేపట్టబోయే పాదయాత్ర ప్రభావం పార్టీపై పడుతుందా, పడితే ఎలా ఉండబోతుందోనని అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ నెల 18వ తేది నుండి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుండి ఆమె పాదయాత్ర ప్రారంభమవుతుంది.