దమ్ముంటే అరెస్ట్ మి, పులిని: రాత్రి శంకరన్న హల్చల్
తాను ఏ తప్పు చేయలేదని, కోర్టులో తేల్చుకుంటానని, తాను అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడకీ వెళ్లలేదని, దేవుడికి పూజలు చేసేందుకు మాత్రమే వెళ్లానని తెలిపారు. తనను అరెస్టు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండానే తాను లేని సమయంలో తన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించారని ఆరోపించారు.
కొన్ని కీలక పత్రాలు పోయాయని, దీనిపై క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే తనపై కక్ష సాధింపుతో ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులు అందరు కలిసి నన్ను టార్గెట్ చేశారన్నారు. తాను ఎక్కడకూ పారిపోలేదని, దేవుడికి పూజలు చేసేందుకు కూడా వెళ్లవద్దా అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపరులను వెనుకేసుకొస్తున్నారని, 2014 వరకు ఆయనే ఉంటే కాంగ్రెసు మరో పదేళ్లు అధికారంలోకి రావడం కల్ల అన్నారు.
ఈ ముఖ్యమంత్రిని ప్రజలు శిక్షిస్తారన్నారు. ప్రజల అండదండలు తనకు ఉన్నాయని, అందుకే తాను ఏడుసార్లు పోటీ చేస్తే ఆరుసార్లు గెలుపొందానని చెప్పారు. కిరణ్ను ప్రజలు శిక్షించక తప్పదన్నారు. తమ పార్టీ అధిష్టానానికి సిఎం వైఖరిని తీసుకు వెళ్తానని, తాను పిల్లిని కాదని పులిని అన్నారు. తాను తప్పించుకు పోయేందుకు క్రిమినల్నో నేరస్తుడినో కాదని, అవినీతిపరులపై ఉద్యమిస్తున్న వ్యక్తిని అన్నారు.
మేమోదో మాఫియా వాళ్లమో, దేశద్రోహులమో అయినట్లు తమపై ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందని, అసలు దేశద్రోహులు వారే అన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు శంకర రావు డిజిపి ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆ తర్వాత మౌనదీక్షకు కూర్చున్నారు. అనంతరం ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో అనుచరులు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు.