ప్రజాప్రస్థానం పాదయాత్ర: ఒంటరిగా షర్మిల తొలిఅడుగు
అన్న కోసం చెల్లెలి తపన
వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం విజయమ్మ, షర్మిల, భారతి రెడ్డిలు బయటకు రాలేదు. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ క్రియాశీలకంగా ఉన్నది లేదు. అయితే వైయస్ మృతి తర్వాత ముఖ్యంగా జగన్ జైలుకు వెళ్లాక దాదాపు కుటుంబ సభ్యులు అందరూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ జైలుకు వెళ్లిన కారణంగా ఆయనకు బదులు షర్మిల తన అన్న కోసం మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు సాహసం చేస్తున్నారు.
పూర్తి పాదయాత్ర రూట్ ఖరారు కానప్పటికీ తొలి ఐదు రోజులు ఆమె కడప జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర ఇడుపులపాయ నుండి ప్రారంభమై తన తండ్రి వైయస్ నాడు పాదయాత్ర చేసినప్పుడు ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించనున్నారు. 63 ఏళ్ల వయస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రతో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. తన అన్నను ప్రజలు మరిచిపోకుండా ఉండేందుకు, ప్రజల్లోకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీసుకు వెళ్లేందుకు షర్మిల యాత్రకు సిద్ధమయ్యారు.
ఒంటరిగా తొలి అడుగు
తండ్రి ఉన్నంత కాలం షర్మిల బయటకు వచ్చింది లేదు. జగన్ జైలుకు వెళ్లక ముందు కూడా ఆమె బయటకు రాలేదు. అయితే మే 27న జగన్ జైలుకు వెళ్లిన తర్వాత తన తల్లి విజయమ్మకు అండగా ఉండేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె బయటకు వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో తల్లితో పాటు పాల్గొన్నారు. విజయమ్మకు అండగా ఉండేందుకు ఆమె పర్యటనల్లో ఇప్పటి వరకు షర్మిల పాల్గొన్నప్పటికీ ఆమెనే ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఉప ఎన్నికల ప్రచారంలోనూ విజయమ్మ మాట్లాడటంలో తడబడినప్పటికీ.. షర్మిల అధికార కాంగ్రెసు పార్టీ పైన, విపక్ష తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం వెనుక షర్మిల ఘాటైన ప్రచారమే కారణమని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆమె ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లలేదు. కానీ అతిపెద్ద పాదయాత్రతో మొదటిసారి అన్న కోసం ఒంటరిగా ప్రజల్లోకి వెళుతున్నారు. షర్మిల తన పాదయాత్రలో కాంగ్రెసు, టిడిపిని టార్గెట్గా చేసుకోనుంది.