యాత్రలో షర్మిలతో కదం కలిపిన భారతి, విజయమ్మ
షర్మిల సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. ట్రిపుల్ ఐటి, వీరగట్టుపల్లె, కుమ్మరాంపల్లె మీదుగా ఆమె యాత్ర కొనసాగింది. షర్మిల వెంటే పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా తదితరులు కూడా ఉన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు పాదయాత్ర చేస్తున్నారు.
కాగా అంతకుముందు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో విజయమ్మ, షర్మిల భారీ బహిరంగ సభలో మాట్లాడారు. వారిద్దరూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై, కాంగ్రెసు ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై జగన్ను జైలుకు పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు జగన్ను టార్గెట్ చేసుకొని చీకట్లో కేంద్రమంత్రి చిదంబరంను కలిశారని ఆరోపించారు.
షర్మిల తనను తాను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్ సోదరిగా పరిచయం చేసుకున్నారు. ఉప ఎన్నికల సమయంలోనూ ఆమె అదేవిధంగా పరిచయం చేసుకున్నారు. తన అన్న తరఫున తాను పాదయత్ర చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. విజయమ్మ ఉద్వేగంగా మాట్లాడటం అందరినీ కలిచి వేసింది.