పందేరం షురూ: రాజ్యలక్ష్మి, బుద్ధప్రసాద్లకు పదవులు

రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిలో రాజ్యలక్ష్మి నెల్లూరు జిల్లాకు చెందినవారు కాగా, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందినవారు. నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత కొంత కాలంగా చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాకు ఒక్క నామినేటెడ్ పోస్టు దక్కవచ్చునని అంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. 2004 ఎన్నికల కాంగ్రెసు విజయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది మందిని మాత్రమే నామినేటెడ్ పోస్టులు వరించాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య కూడా నామమాత్రంగానే పోస్టులను భర్తీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు సాగించారు.
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వని కాంగ్రెసు అధిష్టానం నామినెటెడ్ పోస్టుల భర్తీకి మాత్రం పచ్చ జెండా ఊపినట్లు చెబుతున్నారు. నామినెటెడ్ పోస్టుల నియామకం చేపట్టాలని కాంగ్రెసు నాయకులు చాలా మంది గత కొంత కాలంగా కోరుతూ వస్తున్నారు. అధిష్టానం పరిశీలకుల వద్ద కూడా వారు మొరపెట్టుకుంటూ వస్తున్నారు. నామినెటెడ్ పోస్టుల భర్తీని విడతలవారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత ఎక్కువ మందికి పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications