బాబు ఓకే అంటే నేను స్వాగతం పలుకుతా: టిఆర్ఎస్
పాదయాత్ర అడ్డుకుంటామని చెప్పలేదు.. కోదండరాం
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను తాము అడ్డుకుంటామని చెప్పలేదని తెలంగాణ రాజకీ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సోమవారం అన్నారు. సమస్యలపై పాదయాత్రలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందన్నారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటించే ముందు రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని తెలపాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తాము స్వయంగా నిరసన తెలిపేందుకు వచ్చామని ఆయన పాలమూరులో చెప్పారు.
వందసార్లు మాట మార్చారు.. పెద్దిరెడ్డి
చంద్రబాబు తెలంగాణపై వందసార్లు మాట మార్చారని వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు బాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర నేతలు తెలంగాణలో పర్యటించినా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా ఆయన తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వారి మరణ వాంగ్మూలాలను టిడిపి కార్యాలయానికి పంపించారు.
జగన్ చెప్పులు మోస్తున్న కొండా దంపతులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిలో పాలు పంచుకున్నందు వల్లనే కొండా దంపతులు జగన్ చెప్పులు మోస్తున్నారని ఎమ్మెల్యే భిక్షపతి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వారికి స్థానం లేదన్నారు. వచ్చే ఎన్నికలలోనూ వారు ఓడిపోవడం ఖాయమన్నారు.
కాగా చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణలోని రాజోలికి చేరుకుంటున్న సందర్భంగా అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలువురు నేతలు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.