'ఎ వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం' చలం నవలా, చెత్తనా?

ఇదిలావుంటే, సినిమాపై అభ్యంతరాలతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన లేఖపై కేంద్ర మంత్రి అంబికా సోనీ స్పందించారు. ఏ వుమనే నలుగురు సభ్యులతో ఆమె ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బ్రాహ్మణ కులాన్ని కించపరిచే విధంగా సినిమాలో సంభాషణలు లేవని ఆ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. శూద్ర, నీచ జాతి అనే పదాలను తొలగించాలని కమిటీ సూచించింది. సినిమాలోని 50 శాతం అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని కమిటీ సూచించింది. సర్టిఫై చేయకుండానే సినిమా దృశ్యాలను యూట్యూబ్లో పెట్టారని తేల్చింది.
తమ చౌకబారు సినిమాలను ప్రజలకు చూపించి సొమ్ము చేసుకోవాలనుకునే దర్శక, నిర్మాతలకు గుణపాఠం చెప్పే విధంగా ఈ సినిమాను నిషేధించి దాని నిర్మాత, దర్శకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇటీవల డిమాండ్ చేశారు. మలయాళం, తమిళ భాషల్లో ఉన్న బూతు చిత్రాలకు మెరుగులు దిద్ది వాటిని ప్రేక్షకుల ముందు పెట్టి డబ్బు సంపాదించాలనుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతలు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డిని సచివాలయంలో, రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను రాజ్భవన్లో మంగళవారం కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. రాజ్భవన్లో గవర్నర్కు వినతిపత్రం సమర్పించిన ఐక్య వేదిక నాయకులు - ఈ చిత్రంలో ఉన్న సన్నివేశాలు ఒక్క బ్రాహ్మణ మహిళలనే కాకుండా యావత్ భారత జాతి మహిళలను కించపరిచేవిధంగా ఉన్నాయని అన్నారు.
తమ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి స్పందించి ఈ చిత్రాన్ని నిషేధించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. యుట్యూబ్లో ఇటీవల హల్చల్ చేసిన ఈ సినిమాను ప్రస్తుతం నిలిపేసినా చిత్రం ఇంకా విడుదల కానందున, ముందుగానే దాన్ని నిషేధించాలని వారు కోరారు. ఇదిలావుంటే గుడిపాటి వెంకటచలం రచించిన బ్రాహ్మణీకం అనే నవలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెబుతున్న దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆ నవలను అపహాస్యం చేసే విధంగా పేరు మార్చి సెక్స్ ధోరణితో ఈ సినిమా తీసి విడుదల చేయాలని చూడటం దారుణమని అన్నారు. కొంతకాలంగా వివాదాస్పద సినిమాలు తీయడం, దానిపై చర్చ పెట్టడం, తద్వారా చౌకబారు పాపులారిటీని సంపాదించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
తమ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం నేరం కింద కేసు నమోదు చేశారని వారు వెల్లడించారు. మరోవైపు ‘ఎ ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం' సినిమా హిందీ వెర్షన్లోనూ వస్తున్నట్లు సమాచారం ఉన్నందున ముందుగానే చర్యలు తీసుకుని నిషేధించాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డు చర్యలు తీసుకునే విధంగా కేంద్రప్రభుత్వంతో మాట్లాడాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాను ఎవరూ కొనుగోలు చేయకూడదని వారు పంపిణీదారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, బ్రామ్మణిజం సినిమాను నిషేధించాలని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. బ్రాహ్మణ స్ర్తిల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చిత్రం ఉందన్నారు. బ్రాహ్మణ స్ర్తిలను ఈ చిత్రంలో చాలా అసభ్యకరంగా చిత్రీకరించారన్నారు. గౌరవంగా జీవించే బ్రాహ్మణ స్ర్తిలను అపహాస్యంపాలు చేసేందుకు ఈ చిత్ర నిర్మాత పూనుకున్నారన్నారు. బ్రాహ్మణ మహిళను ఒక బజారు స్ర్తిగా చిత్ర దర్శకుడు చిత్రీకరించడం తమను ఎంతగానో కలిచివేసిందని ద్రోణంరాజు అన్నారు.
సినిమా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సినిమా దృశ్యాలను యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దాంట్లోని హాట్ సీన్సు చూసిన బ్రాహ్మణ పెద్దలు సినిమాపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. సినిమాను మార్కెట్ చేసుకోవడానికి, దొడ్డి దారిన ఆమోదానికి చలం పేరును వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications