అవినీతి రుజువైతే ఎవ్వర్నీ వదిలేదిలేదు: సోనియాగాంధీ
రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సు చారిత్రాత్మకమైనదన్నారు. బడుగు, బలహీన, శ్రామిక వర్గాల పార్టీ కాంగ్రెస్ అని, సేవ, ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమన్నారు. విదేశీ పెట్టుబడులు అవసరమని గతంలో చెప్పిన వారే ఇప్పుడు వాటిని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. సమాజానికి అవినీతి రాచపుండు వంటిదని, దానిని తుదముట్టించేందుకు అందరూ కలిసి పోరాడాల్సి ఉందన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వారే దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. అవినీతి ఆరోపణలు రుజువైతే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. నిందలు వేసే వారికి అభివృద్ధితోనే తాము గట్టి సమాధానం చెబుతామన్నారు.
దేశంలో ఐక్యతను పెంపొందించడంలో కాంగ్రెసు పార్టీ ఎనలేని కృషి చేస్తోందన్నరు. ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. నిజాయితీలో మాకు పోటీ ఎవరూ లేరని, మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. లోక్ పాల్ మేం తప్ప ఎవరూ తీసుకు రాలేరన్నారు. కాగా అంతకుముందు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాందీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడారు.