కిరణ్ గందరగోళంలో ఉన్నారా: బొత్స అంగీకరించారా?
ఏ క్షణంలోనైనా మార్పు ఖచ్చితంగా ఉంటుందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తోంది. కిరణ్కు అధిష్టానం నుండి మార్పు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని, అందుకే ఆయన ఆందోళనలో, గందరగోళంలో ఉన్నారని అంటున్నారు. మార్పు సంకేతాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయం ఏమిటో తెలియక పోవడంతో కిరణ్ అభద్రతకు లోనవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కిరణ్ను ఇటీవల గమనిస్తే అది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
కేవలం కొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి కిరణ్కు అనుకూలంగా మాట్లాడటంతో ఆయనకు పెద్దగా మద్దతు లేదనే విషయం అధిష్టానానికి అర్థమైందని, కిరణ్ తనంతట తానే స్వయంగా తనకు మద్దతు లేదనే విషయాన్ని పెద్దల వద్ద చెప్పుకున్నట్లుగా ఇది ఉందని అంటున్నారు. ఆయనకు కేవలం ముప్పై నలభై మంది ప్రజాప్రతినిధుల మద్దతు మాత్రమే ఉందని అధిష్టానంకు అర్థమైనట్లుగా ఉందంటున్నారు.
నీలం ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ రెండు జిల్లాల్లో మాత్రమే పర్యటించి హఠాత్తుగా వెనుదిరగడం ఆయనలో ఉన్న ఆందోళనే కారణమంటున్నారు. ఇటీవల సభల్లో జగన్ పైన, చంద్రబాబు పైన విరుచుకుపడుతూ ఉత్సాహంగా కనిపించిన కిరణ్ ఇటీవల ముభావంగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ ఆయనలోని 'మార్పు' ఆందోళన కారణంగానే అంటున్నారు.
బొత్స అంగీకరించారా?
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మార్పుపై జరుగుతున్న ఊహానాగాలు అంగీకరించారా అంటే కావొచ్చునని అంటున్నారు. మార్పు జరుగుతుందా అంటే సాధారణంగా గతంలో మార్పు అనేది లేదని, అలాంటి ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని చెప్పేవారు కాంగ్రెసు నేతలు. కానీ బొత్స బుధవారం విచిత్రంగా స్పందించారు. ఇప్పటికి తాను పిసిసి చీఫ్ను అని, కిరణ్ ముఖ్యమంత్రి అని చెప్పారు.
అంతేకాదు.. తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ చేస్తే ఎన్నికయ్యామని, ఆమె దిగిపోమని తమకు ఆదేశాలు జారీ చేస్తే తాము పదవులను త్యజించక తప్పదన్నారు. మార్పు వార్తలను ఖండించకుండా దిగిపోమంటే దిగిపోక తప్పదని, ఇప్పటికి తామే పదవిలో ఉన్నామని చెప్పడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.