మజ్లీస్ ఎఫెక్ట్: రంగంలోకి దిగిన ఆజాద్, ఉద్వాసనేనా?
ఇదిలావుంటే, మజ్లీస్ మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి పోన్ చేసి మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదని చిరంజీవి, బొత్స సత్యనారాయణ వంటి రాష్ట్ర అగ్రనాయకులు చెబుతున్నారు.
కాగా, మజ్లీస్ ఆరోపణలపై ఎఐసిసి అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ స్పందించారు. మజ్లీస్ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెసు స్పందిస్తుందని ఆయన చెప్పారు. యుపిఎపై మజ్లీస్ ఉపసంహరణ ప్రభావం ఉండబోదని ఆయన అన్నారు. యుపిఎకు తగిన సంఖ్యాబలం ఉందని అన్నారు. కాంగ్రెసు సంఘ్ పరివార్తో కలిసి పనిచేస్తుందనే మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణ అర్థరహితమని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాడిని తీవ్రం చేసింది. మజ్లీస్ మద్దతు ఉపసంహరణ వెనక తమ పార్టీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తక్షణమే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు. మజ్లీస్ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోరనే సంకేతాలు కాంగ్రెసు అందినట్లున్నాయని, అందుకే ప్రభుత్వ మనుగడపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దీమా వ్యక్తం చేశారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఎన్నికలను ఎదుర్కోవడానికి ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తాజా పరిణామాల నేపథ్యంలో అందుబాటులో ఉన్న పార్టీ శానససభ్యులతో సమావేశం జరిపారు. కాగా, మజ్లీస్ మద్దతు ఉపసంహరణ వ్యవహారాన్ని తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూసుకుంటుందని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. మజ్లీస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంపై కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని, వివాదాలకు తావు లేకుండా చూస్తున్నామని ఆమె అన్నారు.