ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా, ఎంపిగా కాదు: బాలకృష్ణ
తాను శాసనసభకే పోటీ చేస్తానని, ఎక్కుడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. పార్టీని వీడేవారంతా అవకాశవాదులేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాధారణమేనని ఆయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కొంత మంది వలసలు పోతున్నారని ఆయన విమర్సించారు.
ప్రజల బలం తమ పార్టీకి ఉందని చెప్పారు. ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో తాను కూడా చెప్తానని, పార్టీలో చర్చించిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. వెళ్లేవారు వెళ్లినా ఫరవా లేదని, పార్టీని తాము బలోపేతం చేసుకుంటామని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా వలసలను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని ఆయన చెప్పారు.
తాను శాసనసభకే పోటీ చేస్తానని బాలకృష్ణ మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే, పార్టీ సీనియర్లను, బలమైన అభ్యర్థులను లోకసభకు పోటీ చేయించాలనే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రణాళికలో భాగంగా బాలకృష్ణను హిందూపురం నుంచి పోటీకి దించుతారని వార్తలు వచ్చాయి.
బాలకృష్ణ పోటీ చేయడానికి అనువైన శాసనసభా స్థానాలు చాలానే ఉన్నాయి. కష్ణా జిల్లా గుడివాడ, అనంతపురం జిల్లా హిందూపురం వంటి స్థానాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరో రెండు మూడు సీట్లు కూడా ఆయన పోటీ చేయడానికి అవకాశం ఇచ్చే స్థానాలు ఉన్నాయి.