నన్ను అడుగాతారా: విజయమ్మకు బాబు కౌంటర్

ముఖ్యమంత్రిగా తనకు తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉందని, అటువంటి తనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రుణమాఫీకి ఏ ప్రభుత్వాన్నీ అడగాల్సిన అవసరం లేదని, రుణమాఫీ ఎలా చేయాలో తనకు తెలుసునని ఆయన అన్నారు. ఏ మాత్రం అనుభవం లేనివారు తనకు పాలన గురించి చెబుతున్నారని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేసే ఫైల్పైనే తొలి సంతకం చేస్తానని ఆయన చెప్పారు. మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తూ ఫైల్పై రెండో సంతకం చేస్తానని ఆయన చెప్పారు. తమ పోరాటం వల్లనే 2009లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసిందని చంద్రబాబు చెప్పారు. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని అప్పట్లో అన్నారని ఆయన గుర్తు చేశారు.
బిసి డిక్లరేషన్ పెట్టి బిసిలకు న్యాయం చేయడానికి సిద్ధపడ్డామని ఆయన చెప్పారు. వెనకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వివిధ వర్గాలకు చేసే మేళ్లపై ఆయన వివరించారు. ముస్లింలకు వచ్చే ఎన్నికల్లో తగినన్ని సీట్లు ఇస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
రుణమాఫీని అమలు చేసి తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆయన చెప్పారు. అధికారంలోకి వస్తే గతంలో కన్నా మెరుగైన పాలన అందిస్తానని, నిరుద్యోగులు అధైర్యపడవద్దని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం సాధించాడని రెండేళ్ల పాలన ఉత్సవాలు చేసుకుంటున్నారని ఆయన అడిగారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు వాళ్లు రుణమాఫీ గురించి అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలన పిచ్చి తుగ్లక్ పాలన కన్నా అన్యాయంగా ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications