కిరణ్ రెడ్డిపై అలిగిన మంత్రి కన్నా లక్ష్మినారాయణ
ఆ పత్రిక వార్తాకథనం ప్రకారం - పద్మరాజును విసీగా నియమించాలని కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించి గవర్నర్ నరసింహన్ వద్ద ఆమోదముద్ర వేయించుకున్నారు. అయితే, అడ్వకేట్ జనరల్ అభ్యంతరాల మేరకు నియామక ఉత్తర్వులను గవర్నర్ తాత్కాలికంగా నిలిపేశారు. ఇదే సమయంలో వీసీ నియామకాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుత ఇన్చార్జి ఉపకులపతి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి తప్పిదమూ నిర్లక్ష్యమూ ఉన్నాయని మంత్రి కన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయం పాలనా వ్యవహారాల్లో అపార అనుభవం కలిగిన వ్యక్తిగా నాగిరెడ్డ సకాలంలో ప్రభుత్వానికి మార్గదర్శకం అందించినట్టయితే ఈ తలవంపులు తప్పేవనేది కన్నా లక్ష్మినారాయణ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విసీ పద్మరాజు నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ నరసింహన్ నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో, కొంతవరకైనా పరువు దక్కిందన్న అభిప్రాయం నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా నాగిరెడ్డిదేనని మంత్రి కన్నా భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ విషయమూ నాగిరెడ్డి తన దృష్టికి గానీ, సీఎం పరిశీలనకు గానీ తీసుకురాలేదని ఆగ్రహంతో ఉన్నారు. విసీ నియామకం వ్యవహారం కోర్టులో ఉన్నట్లు కూడా తనకు చెప్పలేదని కన్నా మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నాగిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని కన్నా లక్ష్మినారాయణ ముఖ్యమంత్రిని కలిసి కోరారు. బదిలీ చేయాలని గట్టిగా కోరారు. అయితే, కన్నా మాటలను కిరణ్ కుమార్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. నాగిరెడ్డిని అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో కన్నా లక్ష్మినారాయణ ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.