క్లియర్: ఎర్రంనాయుడు తనయుడి ఆరంగేట్రం
శ్రీకాకుళం: తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహాగానాలకు తెలుగుదేశం దివంగత నేత ఎర్రంనాయుడి కుమారుడు రామ మనోహర్ నాయుడు తెర దించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన శుక్రవారం తేల్చి చెప్పారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన చెప్పారు.
రాజకీయ పరిణతి సాధించే వరకు పెద్దల సహకారం తీసుకుంటానని ఆయన అన్నారు. తన తండ్రి ఎర్రంనాయుడు, బాబాయ్ అచ్చెంనాయుడి మాదిరిగా ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఆయన శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ఎర్రన్నాయుడు నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ రామమనోహర్ నాయుడిని పార్టీ అడిగే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇరవై ఏడేళ్ల రామమనోహన్ నాయుడు లండన్లో చదువుకుంటున్నాడు. రామమనోహర్ నాయుడు శాసనసభకు పోటీ చేస్తానంటే మాజీ శాసనసభ్యుడు అచ్చెంనాయుడిని లోకసభ స్థానం నుంచి రంగంలోకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.