సమావేశాలు 3 రోజులు: బిఏసికి బాబు, కిరణ్ డుమ్మా
శుక్రవారం ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెడుతుంది. శని, ఆదివారాల్లో బిల్లుపై చర్చ ఉంటుంది. స్పీకర్ మనోహర్ అధ్యక్షతన అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బిఏసి సమావేశం జరిగింది. మరోవైపు శీతాకాల సమావేశాల నిర్వహణ ప్రస్తావనకు వచ్చింది. డిసెంబర్ 10 నుండి 21వ తేది వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో తీర్మానించారు. బిఏసి సమావేశం అనంతరం ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు మీడియాతో మాట్లాడారు.
బిఏసి సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనిపై మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. చంద్రబాబు, కిరణ్లు బిఏసి సమావేశానికి రాకపోవడం బాధాకరమన్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్, బిజెపి అన్ని పార్టీలు స్వాగతించాయి.
మరోవైపు శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం జరిగింది. శాసనమండలి రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో నీలం తుఫానుపై చర్చిస్తారు. డిసెంబర్ 10 నుంచి మండలి శీతాకాల సమావేశాలు జరుగుతాయి. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పైన చర్చ జరుగుతుంది.