ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు కూటమి సర్కార్ గుడ్న్యూస్..
రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతికి కార్మికులు, యాజమాన్యాలు రెండు కళ్లలాంటివని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే కార్మికుల శ్రమకు తగిన గౌరవం, భద్రత, సంక్షేమం కల్పించడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'శ్రమ శక్తి - ఉత్తమ యాజమాన్య పురస్కారాలు 2026' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు.
కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కార్మికుల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గతంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వివాహ కానుకగా రూ.20 వేల సహాయం, ప్రసూతి సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం, సహజ మరణానికి రూ.60 వేల పరిహారం, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.20 వేల సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.

"లేబర్ అడ్డాస్"..
రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికులు తీవ్ర ఎండలు, వర్షాల్లో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా "లేబర్ అడ్డాస్" ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, విశ్రాంతి గదులు, భోజన సదుపాయాలు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికులు గౌరవప్రదమైన వాతావరణంలో పనిచేసే పరిస్థితులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
20 లక్షల ఉద్యోగాల దిశగా చర్యలు..
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు అమలు చేస్తూ, వచ్చే కొన్నేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు.
కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక ప్రణాళిక..
కార్మికుల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. రూ.250 కోట్ల వ్యయంతో ఆరోగ్య పరీక్షల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం సహా ఐదు ప్రధాన నగరాల్లో ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించనున్నామని, అదనంగా 30 కొత్త వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
"జీరో యాక్సిడెంట్స్" లక్ష్యంగా చర్యలు..
పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్మికుల భద్రత కోసం థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించి, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికుల ప్రాణాలు అమూల్యమని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంపై విమర్శలు..
గత ప్రభుత్వ కాలంలో కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చి, కార్మికులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు.
ఉత్తమ కార్మికులకు పురస్కారాలు..
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు 'శ్రమ శక్తి' మరియు 'ఉత్తమ యాజమాన్య' పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. కష్టపడి పనిచేసే కార్మికులే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమని కొనియాడారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కూడా సమానంగా ముందుకు సాగితేనే రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications