జగన్ ఆస్తుల కేసు: మోపిదేవికి హైకోర్టులో చుక్కెదురు
వాన్పిక్ కేసులో ఛార్జీషీటు దాఖలు చేసి ఆరు నెలలు దాటిందని, తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిందని, తనకు బెయిల్ ఇవ్వాలని మోపిదేవి హైకోర్టులో వాదించారు. అయితే మోపిదేవి మాజీ మంత్రి అని, ఓ ఎమ్మెల్యే అని, ప్రస్తుతం బెయిల్ ఇస్తే బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయన ప్రభావితం చేయగల వ్యక్తి అని సిబిఐ వాదించింది.
సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందని హైకోర్టుకు తెలిపింది. కాబట్టి బెయిల్ ఇవ్వవద్దని కోరింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మోపిదేవి వెంకట రమణకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ... అతని పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు వైయస్సార్కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను స్వీకరించింది.
జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. అనంతరం విచారణను ఈ నెల 11వ తేదికి వాయిదా వేసింది. కాగా సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన తీర్పు రేపు రానున్న విషయం తెలిసిందే. అంతకుముందు స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.