అప్పుడేమో సిఫార్సు, ఇప్పుడు..: జెఠ్మలానీకి సుప్రీం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వాదనలు ప్రారంభించగానే, డివిజన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామ్ జెఠ్మలానీ రమణకు ఇచ్చిన కితాబు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు గుర్తు చేసింది
"అప్పుడు మంత్రిగా ఆ నియామకాన్ని సమర్థించిన మీరే, ఇప్పుడు న్యాయవాదిగా వచ్చి నియామకాన్ని ఎలా తప్పుపడతారు? అసలు ఈ కేసును మీరు ఎలా వాదిస్తారు?'' న్యాయమూర్తులు ప్రశ్నించారు. "మీ వాదన వినేదిలేదు. మరో న్యాయవాది వాదన వింటాం'' అని తెలిపారు. దీంతో పిటిషనర్ తరఫున మరో లాయర్గా ఉన్న శాంతిభూషణ్ తన వాదనలను ప్రారంభించారు. ఈ దశలో న్యాయమూర్తులు జోక్యం చేసుకొని... "అసలు ఈ కేసుకు విచారణ అర్హత ఉందా? లేదా?'' అనే విషయంపై కోర్టుకు సూచన చేయాలని అటార్నీ జనరల్ను ఆదేశించారు.
జస్టిస్ ఎన్వీ రమణ నియామకానికి సంబంధించిన అన్ని రికార్డులు, ఫైళ్లను సీల్డు కవర్లో అందచేయాలని హైకోర్టు సెక్రటరీ జనరల్ను ఆదేశించారు. రెండు దశాబ్దాల కిందట ఎన్వీ రమణపై నమోదైన కేసుకు సంబంధించిన రికార్డులు, మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన రికార్డులు అన్నీ పంపించాలని ఆదేశించారు.
జస్టిస్ రమణ నియామకం మీద పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో, ఎలాంటి నిర్ణయాలు చేశారో తెలియజేయాలని అటార్నీ జనరల్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications