చెబితే చాలా ఉంది: బాబుపై పురంధేశ్వరి భర్త నిప్పులు
పురంధేశ్వరి విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని ఆయన గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారని అప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. అప్పుడు నిద్రపోయారా అని ప్రశ్నించారు. పురంధేశ్వరి 2005 నుండి ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో పెట్టించేందుకు పలుమార్లు లేఖలు రాశారన్నారు. ఇప్పటి వరకు 12 లేఖలు రాశారన్నారు.
2009లో యూపిఏ తిరిగి అధికారంలోకి వచ్చాక కూడా పురంధేశ్వరి లేఖలు రాశారన్నారు. ఆమె కృషి వల్లే పార్లమెంటులో విగ్రహ ఏర్పాటు జరగనుందని, అయినా ఆమె కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబుకు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు గురించి అడిగేందుకు సమయం చిక్కలేదా అని ప్రశ్నించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టించేందుకు కృషి చేయడం లేదని పురంధేశ్వరిపై బాబు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఎప్పుడైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు కృషి వల్ల బేగంపేట విమానాశ్రయానికి ఆ పేరు వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ను పూర్తిగా విస్మరించారన్నారు. చౌకబారు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడవద్దని బాబుకు సూచించారు.
ఎన్టీఆర్కు భారతరత్న తీసుకు వచ్చేందుకు బాబు ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు. బాబు ఎప్పుడైనా ఎవరితోనైనా కేంద్రానికి లేఖ పంపించారా అన్నారు. కుంభకర్ణ నిద్రను వీడి బాబు విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. రాసేవాళ్లున్నారని గ్లోబెల్స్ ప్రచారం చేయకూడదన్నారు. 2005లో టిడిపి నేతలు పార్లమెంటులో ఎన్టీఆర్ను దూషిస్తుంటే అప్పుడు పురంధేశ్వరి సభలో ఉండలేక పోయారన్నారు.
ఆ సమయంలో ఆమె తనకు పదవి కంటే తన తండ్రి ముఖ్యమని సభ నుండి బయటకు వచ్చారన్నారు. తన తండ్రిని దూషిస్తుంటే చూస్తూ కూర్చోలేనని ఆమె సభను విడిచి బయటకు వచ్చారన్నారు. దొంగచాటుగా కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించి పురంధేశ్వరి సంతకం లేదని చెప్పడమేమిటని ప్రశ్నించారు. బాబు గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉందని, ఆయనకు అధికార దాహం తప్ప ఏమీ పట్టదన్నారు.
బాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆయన అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారని, కానీ మీకోసం అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. మీకోసం అంటే నవ్వొస్తుందన్నారు. అధికారం కోసమే బాబు కాంగ్రెసు నుండి తెలుగుదేశం పార్టీ పంచన చేరారన్నారు.