బాబు ప్రణాళిక: హెరిటేజ్పై వైయస్ జగన్ సాక్షి వ్యాఖ్య
రిటైల్ రంగంలో ఎఫ్డిఐలు చిన్న వ్యాపారుల పొట్ట కొడుతాయని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని పార్లమెంటులో టిడిపి ఎంపీలు చెప్పిన విషయం తెలిసిందే. బయట కూడా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎఫ్డిఐలకు తాము వ్యతిరేకమని చెప్పారు. అయితే ఓ వైపు ఎఫ్డిఐలపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగానే... తమ సంస్థను విస్తరించే ప్రణాళికలు చంద్రబాబు రూపొందించినట్లుగా హెరిజేట్ ఫుడ్స్ వర్గాలు చెప్పాయని సాక్షి రాసింది.
1992లో పాల డెయిరీ వ్యాపారంతో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్, కొద్ది సంవత్సరాల క్రితం హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో రిటైల్ దుకాణాల్ని కూడా ఏర్పాటు చేసిందని, తాజా విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రిటైల్ వ్యాపారాన్ని వేరు చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ పేరుతో ఒక సంస్థను కూడా రిజిస్టర్ చేసి సిద్ధంగా ఉంచారని పేర్కొంది. రిటైల్ వ్యాపారాన్ని వేరుపర్చి, దేశీయ లేదా విదేశీ భాగస్వామిని చేర్చుకునే ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసిందంటూ కంపెనీ ప్రెసిడెంట్ను ఉటంకిస్తూ కొన్ని పత్రికల్లో ఇటీవల వార్తలు వచ్చాయని రాసింది.
ఈ లోపే ఎఫ్డిఐ ఓటింగు గురించి టిడిపిపై విమర్శలు వెల్లువెత్తడంతో కంపెనీ హడావుడిగా స్టాక్ ఎక్సేంజ్లకు ఒక వివరణ ఇచ్చిందని, ప్రమోటర్లు వాటాను అమ్మబోరని, రిటైల్ వ్యాపారానికి ఒక వ్యూహాత్మక భాగస్వామితో జత కట్టేందుకు సిద్ధమన్నది ఆ వివరణ సారాంశం అని సాక్షి రాసింది.