సోనమ్ కు మద్దతుగా దీక్షల్లోకి బెంగళూరు స్టూడెంట్స్- ప్రకాశ్ రాజ్ ప్రకటన..!
నీట్ సహా ఇతర పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నిరాహారదీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ను 21 రోజుల అనంతరం ఇవాళ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనకు కొనసాగింపుగా సోనమ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై దేశవ్యాప్తంగా విద్యార్ధి లోకం ఆందోళనకు దిగుతోంది. ఇందులో భాగంగా తాము కూడా దీక్షలు చేపడతామని బెంగళూరు విద్యార్ధులు ప్రకటించారు.
సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా తాము కూడా నిరాహారదీక్షలకు దిగుతున్నట్లు బెంగళూరు యూనివర్శిటీ (Bengaluru University) విద్యార్ధులు ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు నోటీసు కూడా ఇచ్చారు. ఇదే విషయాన్ని మరో సామాజిక కార్యకర్త, నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ ట్వీట్ చేశారు. బెంగళూరు విశ్వవిద్యాలయ విద్యార్థులు రేపు సోనమ్ వాంగ్ చుక్, కాక్రోచ్ జనతా పార్టీకి సంఘీభావం తెలుపుతూ నిరాహార దీక్ష చేపట్టనున్నారని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

జవాబుదారీతనాన్ని కోరడంలో మీ అలుపెరుగని స్ఫూర్తికి యువతకు మరింత శక్తి లభించాలని, పౌరులందరూ మీరు ఎక్కడున్నప్పటికీ గళం విప్పాలని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ, సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన ఆందోళనకు ప్రకాశ్ రాజ్ పలుమార్లు హాజరై సంఘీభావం తెలిపారు. ఇప్పుడు బెంగళూరు యూనివర్శిటీ విద్యార్ధులు కూడా అదే బాట పట్టనుండటంతో కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో ఆందోళనలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications