దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్
ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరుకున్న ఆసియా సింహాలు.. ఇప్పుడు భారత అటవీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తూ గర్జిస్తున్నాయి. ప్రపంచ సింహాల దినోత్సవం వేళ మన దేశం గర్వపడేలా ఒక తీపి కబురు అందింది. గుజరాత్ పరిధిలోని గిర్ అభయారణ్యంలో సింహాల సంఖ్య గణనీయంగా పెరిగి, పర్యావరణ పరిరక్షణలో భారత్ సాధించిన సరికొత్త విజయానికి నిదర్శనంగా నిలిచింది.
కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మన దేశంలో ఆసియా సింహాల సంఖ్య ఏటికేడు పుంజుకుంటోంది. 2015 లెక్కల ప్రకారం దేశంలో కేవలం 523 సింహాలు మాత్రమే ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 891కి చేరింది. దశాబ్ద కాలంలోనే ఈ స్థాయిలో జనాభా పెరగడం పట్ల అటవీ అధికారులు, జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలు, క్షేత్రస్థాయి సిబ్బంది పగలు రాత్రి పడ్డ కష్టమే ఈ ఫలితానికి ప్రధాన కారణం.

జాతీయ స్థాయి విస్తరణ.. పెరిగిన ఆవాస ప్రాంతం
2020లో ప్రారంభించిన ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా సింహాల సంరక్షణ సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు 30 వేల చదరపు కిలోమీటర్ల మేరకే పరిమితమైన వీటి ఆవాస ప్రాంతం, ఇప్పుడు దాదాపు 35 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అభివృద్ధి సంక్షేమాలు, ప్రకృతి సంరక్షణ ఒకదానికొకటి అడ్డుకావని, రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లవచ్చని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ
అడవుల్లో జంతువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, వ్యాధుల నుంచి రక్షణకు ఆధునిక వైద్యాన్ని అందించడం, సాంకేతిక పరిజ్ఞానంతో వాటి కదలికలను కనిపెట్టడం వంటి చర్యలు సింహాల ఆయుష్షును పెంచాయి. ప్రధానంగా గిర్ అడవుల సరిహద్దుల్లో నివసించే స్థానిక ప్రజలను ఈ సంరక్షణ ప్రక్రియలో భాగస్వాములను చేయడం వల్ల వేట పూర్తిగా అదుపులోకి వచ్చి, సింహాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
గిర్ అడవుల్లో వినిపిస్తున్న ఈ గర్జన రాబోయే తరాలకు కూడా ఇలాగే వినిపిస్తుందని, వన్యప్రాణుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది.




Click it and Unblock the Notifications