Amit Shah: ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అమిత్ షా..! ఒత్తిడికి తలొగ్గి కీలక నిర్ణయం..!
నీట్ అక్రమాలపై ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్దులపై పోలీసుల దాడులపై ఇప్పటివరకూ పార్లమెంట్ కు వచ్చి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. ముప్పేట దాడి నేపథ్యంలో వెనక్కి తగ్గారు. అమిత్ షాను ఎలాగైనా పార్లమెంట్ కు రప్పించాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్ని స్తంభింపచేస్తున్న వేళ.. ఎట్టకేలకు అమిత్ షా తన నిర్ణయం మార్చుకున్నారు. పార్లమెంట్ కు హాజరై ఢిల్లీ పోలీసుల దాడులపై సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు.
నీట్ అక్రమాల నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో విద్యార్ధులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ కు బయలుదేరారు. వీరిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాలతో పాటు పెల్లెట్ గన్ లను కూడా ప్రయోగించారు. అలాగే మేకులు కొట్టిన లాఠీలతో బాదడం, ఎలక్ట్రిక్ బేటన్లతో కొట్టడం చేశారు. దీంతో భారీ సంఖ్యలో విద్యార్ధులు గాయాలపాలయ్యారు. వీరిని వివిధ ఆస్పత్రుల్లో కేంద్రమంత్రులు పరామర్శించారు. అప్పటి నుంచీ ఈ దారుణాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం కోసం విపక్షాలు పట్టుబడుతున్నా కేంద్రం ఒప్పుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో విపక్షాలు నిత్యం ఉభయసభల్ని స్తంభింపచేస్తున్నా అమిత్ షా మాత్రం సభకు రావడం లేదు. దీంతో ఓ దశలో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ కూడా విపక్షాల డిమాండ్ ప్రకారం అమిత్ షాను సభకు రప్పించాలని పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజుకు సూచించారు. దీంతో పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఢిల్లీలో పెల్లెట్ గన్లు, బీహార్లో ఏకే-47లను ఉపయోగించడంపై హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో హాజరై వివరణ ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు అంగీకరిస్తున్నట్లు, పోలీసుల చర్యతో సహా విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ప్రతి అంశంపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే సభా కార్యకలాపాల సమయంలో ప్రతిపక్షాలు హంగామా సృష్టించకూడదని మంత్రి షరతు పెట్టారు.




Click it and Unblock the Notifications