అవును.. వాళ్లిద్దరూ రాజీ పడ్డారు - పార్టీ ఇంఛార్జ్ సమక్షంలో కీలక ప్రకటన..!!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టింది. అందులో భాగంగా ముందుగా నేతల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించేలా కార్యాచరణ ప్రారంభించింది. నేతల మధ్య సమన్వయం పైన ఫోకస్ చేసింది. ఇందు కోసం పార్టీ కీలక నేతలు బండి సంజయ్ - ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరేలా చొరవ తీసుకుంది. ఇద్దరూ కలిసి తమ మధ్య విభేదాలు లేవని.. పార్టీ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో ఆ ఇద్దరు నేతలు రాజీ పడ్డారు. తెలంగాణ లో పార్టీ బలోపేతం పైన బీజేపీ నాయకత్వం కొత్త కార్యాచరణ అమలు చేస్తెంది. తాజా గా పార్టీ చీఫ్ తెలంగాణలో పర్యటించారు. ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నేతల మధ్య విభేదాలు పార్టీకి సమస్యగా మారాయని గుర్తించారు. ఇప్పటికే నేతల మధ్య ఐక్యత అంశం పైన హోం మంత్రి అమిత్ షా సహ పలువురు పార్టీ ముఖ్య నేతలు సూచించారు. అయినా.. మార్పు రాకపోవటం పైన పార్టీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అభయ్ పటేల్ ముందుగా ఈటెల నివాసానికి వెళ్లి సుదీర్ఘ మంతనాలు చేసారు. బండి సంజయ్ తో విభేదాలు లేకుండా కలిసి సాగాలని సూచించారు.

బీజేపీ ఆపరేషన్ తెలంగాణ
ఆ తరువాత కేంద్ర మంత్రి బండి సంజయ్ తోనూ సంప్రదింపులు జరిపారు. ఇద్దరి నేతలతో కలిసి బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నివాసంలో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు కలిసి కట్టుగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఇద్దరూ తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరం కలిసి పార్టీ కోసం పని చేస్తామని ఇంఛార్జ్ సమక్షంలో ప్రకటించారు. దీంతో, ఇతర నేతల మధ్య ఇదే రకమైన సమన్వయం కోసం పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలను నేరుగా హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల పైన స్పెషల్ గా ఫోకస్ చేసిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇక, ఇప్పుడు ఈ ఇద్దరి రాజీ ఫార్ములా ద్వారా ఎలాంటి మార్పు వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications