కెసిఆర్ బెదిరించాడు, జగన్ కేసు సరే తెలంగాణ: ఎర్రబెల్లి
తెలంగాణపై తేల్చాల్సిన స్థానంలో ఉన్న కాంగ్రెసు పార్టీని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కెసిఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు సెంటిమెంటును ఉపయోగించుకొని పదవులు పొందాయని, ఆస్తులు సంపాదించుకున్నాయని ఆరోపించారు. సోనియా అఖిల పక్ష భేటీకి హాజరు కావాలని కెసిఆర్ డిమాండ్ చేయగలరా అని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న విమలక్క విడుదలకు కెసిఆర్ ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. ఆమెను భేషరతుగా విడుదల చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోందన్నారు. కెసిఆర్ అన్నా స్వార్థంతో తెలంగాణ అంటున్నాడని కానీ విమలక్క తదితరులు అలా కాదన్నారు. కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు పరుగెత్తించే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెరాస తొత్తుగా మారారన్నారు.
కోదండరాంను కెసిఆర్ బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడన్నారు. టిడిపి తెలంగాణ కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఐకాస ఏనాడూ గుర్తించలేదన్నారు. జెఏసి, తెరాసలకు తమకు ఆల్టిమేటం జారీ చేసే నైతిక హక్కు గానీ, తిట్టే అధికారం గానీ లేదన్నారు. కెసిఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే రానంత, వారి కుటుంబాన్ని పరామర్శించలేనంత బిజీగా కెసిఆర్ ఉన్నారా అని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆస్తుల ధ్వంసం కేసు ఎత్తి వేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులపై ఎందుకు కేసులు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమకారుల పైనా కేసులు ఎత్తివేశారన్నారు.