పెట్రోల్, డీజిల్ తర్వాత వీటి రేట్లు భారీగా పెంచిన కేంద్రం
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీఎన్జీ రేట్లపై పడింది. వీటి రేట్లను భారీగా పెంచింది. కిలోపై రెండు రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరుగుతున్నందున రెండు వారాల మూడోసారి సీఎన్జీ ధరలను సవరించింది. ఈ తెల్లవారు జాము నుంచి పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇకపై అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ. 83.09 పైసలకు చేరింది. ఈ నెల 15వ తేదీ నుండి సీఎన్జీ ధరలు మొత్తం అయిదు రూపాయల మేర పెరిగాయి. ఇదివరకు శనివారం కిలోపై ఒక రూపాయి పెరగ్గా, అంతకుముందు 15న కిలోకు రెండు రూపాయల మేర పెరిగింది. ముచ్చటగా మూడోసారి మరో రెండు రూపాయలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి.

నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో సీఎన్జీ ధర కిలోకు రూ. 88.70 పైసలకు చేరింది. ముంబైలోనూ ఇదే విధమైన ధరల పెరుగుదల కనిపించింది. సీఎన్జీ ఇప్పుడు కిలోకు రూ. 84 లకు అమ్ముడవుతోంది. గృహాలకు సరఫరా చేసే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) లేదా డొమెస్టిక్ సిలిండర్ల ధరలలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేకపోవడం కొంత ఊరట ఇచ్చే విషయం.
పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరలతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ తాజా ఇంధన ధరల పెంపు చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో సరఫరా అంతరాయాల భయాలే ఈ పెరుగుదలకు కారణం. గల్ఫ్ రీజియన్ లో నెలకొన్న ఉద్రిక్తతలతో సరఫరా ఆందోళనలు అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో అస్థిరతకు దారితీశాయి.
దీనివల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. తమకు వచ్చే నష్టాలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేస్తుండటంతో ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది వాహనదారులకు. ఇంధన ధరలు పదేపదే పెరగడం రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరల పెరుగుదలకు దారి తీస్తాయి.సరఫరా అంతరాయాల భయాలు అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల, ఇంధన భద్రతపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications