చిత్రాలు: కెసిఆర్పై ఢీ అంటే ఢీ, రెచ్చగొట్టడమే..
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి ఎదురు పార్టీలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఒక వ్యూహంగా ఎంచుకున్నాయి. కెసిఆర్ను, తెరాస నాయకులను రెచ్చగొట్టడమే వ్యూహంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తోంది.
తాజాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెసిఆర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసకుంటే తెలంగాణ వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో తెరాస శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కెసిఆర్ కూడా ఆ వ్యాఖ్యలపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను దరిద్రపుగొట్టు మాటలుగా ఆయన కొట్టిపారేశారు. తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారని, అలాంటి వ్యాఖ్యలు చేసినవారు కూడా అందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
వ్యాఖ్యల వివాదం ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీశాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తున్న పార్టీల కార్యక్రమాలను తాము అడ్డుకోబోమని తెరాస నాయకులు ప్రకటించారు. దీంతో అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర పెద్దగా ఆటంకాలు లేకుండా సాగుతోంది. ఇటు షర్మిల పాదయాత్రకు కూడా పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు. దీంతో ఘర్షణ వాతావరణం లేకుండా పోయింది. కెసిఆర్ ప్రాబల్యాన్ని తగ్గిస్తే తప్ప తాము నిలదొక్కుకోలేమని భావించిన పార్టీల నాయకులు కెసిఆర్పై తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

వరంగల్ జిల్లాలో తెరాస బలంగా ఉంది. ఇటీవలి పరకాల ఉప ఎన్నికల్లో తెరాస చేతిలో కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తన ప్రాబల్యాన్ని కాపాడుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆమె కెసిఆర్ను, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె తీవ్రమైన దుమారం రేపే విధంగా మాట్లాడారని అంటున్నారు. కొండా సురేఖ దంపతులకు వరంగల్ జిల్లాలో పార్టీ బలమే కాకుండా సొంత బలగం కూడా ఉంది. దీంతో ఆమె ఢీ అంటే ఢీ అంటున్నారు.

ఇక కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి కెసిఆర్ మీద కోపం గడ్డం మీదనే ఉంటుంది. కెసిఆర్పై ఆయన చేయని ఆరోపణ అంటూ ఉండదు. కెసిఆర్కు తెలంగాణ రావాలనే ఉద్దేశం లేదని కూడా ఆయన అంటారు. నిజానికి, తెరాస నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. మెదక్ జిల్లాలో తెరాస బలంగా ఉంది. అందువల్ల ఆ జిల్లాలో దాన్ని బలాన్ని దెబ్బ తీయడం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కెసిఆర్పై, ఆయన కుటుంబ సభ్యులపై మోత్కుపల్లి ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని కెసిఆర్ ప్రధానంగా టార్గెట్ చేసుకోవడమే అందుకు కారణం కావచ్చు.

ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్గా తెరాసను ఎదుర్కునే బాధ్యత ఉంది. కెసిఆర్పై ఆయన కూడా తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. తాజాగా, ఆయన కెసిఆర్ కుటుంబ ఆస్తులపై కూడా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications