హత్యాయత్నకుట్ర: పరిటాల శ్రీరామ్పై కేస్, ఇరికించారు: సునీత
ధర్మవరంకు చెందిన కాంగ్రెసు పార్టీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి పైన హత్యాయత్నం కుట్ర జరిగింది. దీనిని పోలీసులు చేధించారు. ఈ కుట్ర కేసుకు సంబంధించి శ్రీరామ్ సహా పది మందిపై కేసు నమోదయింది. ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. నాగూర్ హుస్సేన్ అనే వ్యక్తి ఆయుధాలు సరఫరా చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. అతనిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. నిందుతుల సమాచారం మేరకు పరిటాల శ్రీరామ్, అతని డ్రైవర్ రాముపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
కాగా పరిటాల రవీంద్ర - పరిటాల సునీతల తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ ఇటీవల రాజకీయాల్లోకి రానున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అతనిని 2014 ఎన్నికల్లో పోటీకి దింపేందుకు తల్లి, రాప్తాడు టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇరికించారు
తనను రాజకీయంగా ఎదుర్కోలేక తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను కేసులో ఇరికించారని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఫ్యాక్షన్కు దూరంగా పెంచానన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే శ్రీరామ్ను ఇరికించారన్నారు. ఉన్నత విద్య కోసం జనవరిలో విదేశాలకు వెళుతున్న సమయంలో ఇలా చేశారని ఆమె ఆరోపించారు. విచారణ జరిగేతే నిజాలు బయటకొస్తాయన్నారు.