జగన్వైపు వెళ్లే బ్రోకర్లు: ఉత్తమ్, చిరుకోసం ఎగబడ్డ జనం
వారు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ అంటున్నారని కానీ, తాను మాత్రం ఎక్కడ మాట్లాడితే తెలంగాణ వస్తుందే అక్కడే మాట్లాడుతానని చెప్పారు. జగన్తో వెళ్లేందుకు సిద్ధమైన వారు తెలంగాణవాదులు అవుతారా అని ప్రశ్నించారు. జగన్ పార్టీలోకి వెళ్లేందుకు వారు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తన కంటే ప్రతిభ, అర్హత గల నేతలు ఎవరూ లేరన్నారు. బ్రోకర్లు, కొందరు నేతలు తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన నిప్పులు చెరిగారు.
తన ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదన్నారు. తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. పదవుల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టులు పొంది డబ్బులు సంపాదించిన వారికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకొని తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. అలాంటి వారిని నల్గొండ జిల్లా ప్రజలు నమ్మరన్నారు.
చిరంజీవిను చూసేందుకు ఎగబడ్డ జనం
హుజూర్ నగర్ ప్రగతి ఉత్సవాలకు కేంద్రమంత్రి చిరంజీవి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు వచ్చారు. ప్రగతి ఉత్సవాలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు జనం ఎగబడ్డారు. చిరు కోసం ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు.
కాగా రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. తన భిక్షతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడిన కేంద్రమంత్రి చిరంజీవిని జిల్లాకు ఆహ్వానించడమేమిటని ప్రశ్నించారు. మంత్రులంతా పనికి రాని వారని, వారు పదవులకు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు.