హేట్ స్పీచ్: మజ్లీస్ ఎమ్మెల్యే అక్బర్పై కేసు నమోదు
డిసెంబర్ 24వ తేదీన చేసిన హేట్ స్పీచ్పై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై తాను వేసిన పిటిషన్ల వంటివి మరిన్ని కోర్టుల్లో దాఖలు చేయాలని పిటిషన్ వేసిన వ్యక్తి ప్రజలను కోరిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్పై పిటిషన్ వేసిన కె కరణ్సాగర్కు మూడు సార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ విషయంపై దర్యాప్తు చేసి జనవరి 17వ తేదీలోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ను ఆదేశించింది. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు.
అక్బరుద్దీన్పై కేసు నమోదు చేయాలని బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన అక్బరుద్దీన్పై చర్యకు ఆయన డిమాండ్ చేశారు. ఓవైసీ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను కోరాలని ఆయన సూచించారు. హింసను ప్రేరేపిస్తూ చేసిన ప్రసంగాలపై అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోవాలని పౌర ప్రముఖులు కోరారు. సమాజాన్ని విభజించి, ప్రశాంతతను భంగపరచడం వల్ల ఘర్షణలు తలెత్తి అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
అసహనంతో కూడిన ప్రసంగాలు తిరిగి చేయకుండా చర్యలు తీసుకోవాలని సినీ దర్శకుడు మహేష్ భట్, సామాజిక కార్యకర్త అగ్నివేష్, హమీద్ మహ్మద్ ఖాన్, ఇర్ఫాన్ ఇంజనీర్, మజర్ హుస్సేన్, రామ్ పుణ్యాని, ఎం మండల్, డాక్టర్ అస్ఘర్ ఇంజనీర్, సందీప్ పాండే సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో డిసెంబర్ 24వ తేదీన అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కూడా అక్బరుద్దీన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.