రెచ్చగొడుతున్నారు: కిషన్, నో కామెంట్: అసదుద్దీన్
అక్బరుద్దీన్ మాట్లాడిన ప్రసంగ సిడిలను ముఖ్యమంత్రికి అందజేశారు. సిడిలను పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మజ్లిస్ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ నాయకుడిగా, ఓ శాసనసభ్యుడిగా అక్బరుద్దీన్ ఓవైసీ రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేసి.. ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారన్నారు.
పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి అధికారం మా చేతికి ఇస్తే చేసి చూపిస్తామన్నట్లుగా మజ్లిస్ నేతలు మాట్లాడుతున్నారని, ఏం చేస్తారో చెప్పాలన్నారు. దేవాలయాల గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. హిందువులకు నెలకు, వారానికో పండగ వస్తుందని, ఎంతోమంది దేవుళ్లుంటారంటూ చేసిన అనుచిత వ్యాఖ్యల వివరాలను ముఖ్యమంత్రికి అందజేసినట్లు వారు చెప్పారు.
మజ్లిస్ నేతలు శ్రీరాముడిని, సీతాదేవి పుట్టుకపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. కసబ్ను పొగుడుతున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా మజ్లిస్ నేతలు గౌరవించడం లేదని ఆరోపించారు. ఉద్రేక పూరిత ప్రసంగాలు చేస్తున్న మజ్లిస్ శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎన్నికల గుర్తింపును కూడా రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా కిషన్ రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కోర్టు పరిధిలో ఉంది
అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటి గురించి తాను ప్రస్తుతం మాట్లాడనని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
కోర్టులో నేడు తీర్పు
అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు చెప్పనుంది.