తెలంగాణకి వ్యతిరేకంగా: అక్బరుద్దీన్ హేట్స్పీచ్లో ట్విస్ట్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో కొత్త ట్విస్ట్! హిందూ దేవతలను, హిందువులను టార్గెట్గా చేసుకున్న అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మజ్లిస్ పార్టీ బిజెపిని టార్గెట్ చేసుకోవడమే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో హిందువులను టార్గెట్గా చేసుకొని వ్యాఖ్యలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
తెలంగాణను అడ్డుకునే ఉద్దేశ్యంలో భాగంగా మజ్లిస్ పార్టీ ఇలా కొత్తగా మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటోందని కిషన్ అన్నారు. మతకల్లోహాలను సృష్టించి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం మజ్లిస్ పార్టీ చేస్తోందన్నారు. ఇటీవల అఖిల పక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలను ఈ సమావేశానికి ముందే నిర్మల్లో జరిగిన సభలో అన్నారు.
అయితే తెలంగాణకు అనుకూలంగా వివిధ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటుండటంతో దానిని అడ్డుకునే ఉద్దేశ్యంలో భాగంగా తెలంగాణకు మద్దతిస్తున్న బిజెపిని, హిందువులను టార్గెట్గా చేసుకుని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఇబ్బందుల్లో పడవద్దనే ఉద్దేశ్యంతో దానిని వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఎన్డీయోలోని ప్రధాన పక్షం బిజెపి తెలంగాణకు గట్టిగా మద్దతు పలుకుతోంది.

హిందూవాద పార్టీగా ముద్రపడిన బిజెపిని ముస్లింలు అక్కున చేర్చుకోలేరు. దానినే ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. బిజెపి తెలంగాణ అంటోందని, రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ వస్తే బిజెపి పట్టు బిగిస్తుందని, అది ముస్లిం వర్గాలకు మంచిది కాదని ఆ వర్గాలకు మజ్లిస్ పార్టీ నూరిపోసే విధంగా పావులు కదుపుతోందని అంటున్నారు.
ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీ కేవలం పాతబస్తీకే పరిమితమైంది. ఇటీవల ఆ పార్టీ తమ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ఆ ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు పార్టీతో తెగతెంపులు చేసుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జత కట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బిజెపి తెలంగాణ అంటుండగా... తెలంగాణలోని పలువురు ముస్లింలు ఇప్పటికే తెలంగాణ వద్దంటుండగా చాలామంది విభజనకు ఓటేస్తున్నారు.
బిజెపి తెలంగాణ వాదం గట్టిగా వినిపిస్తుందని, రాష్ట్రం విడిపోతే ఆ పార్టీ లాభపడుతుందని కాబట్టి తెలంగాణను మనం వ్యతిరేకించాలనే భావనను ముస్లిం వర్గాలలో తెచ్చేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. బిజెపికి, తెలంగాణకు వ్యతిరేకంగా ముస్లిం వర్గాలను కూడగట్టడం ద్వారా పార్టీని కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేసుకోవచ్చన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
మజ్లిస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఉంటే సమైక్యాంధ్ర లేదంటే రాయల తెలంగాణ అంటోంది. ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాలన్నింటిని ఒక్కటిగా ఉంచాలని మజ్లిస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాయల తెలంగాణ వ్యూహం అందులో భాగమేనని అంటున్నారు. ఇటీవల తెలంగాణ అంశంపై బిజెపి మజ్లిస్ పార్టీని టార్గెట్గా చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణపై మజ్లిస్ పార్టీని ఇప్పటి వరకు ఘాటుగా ఏ పార్టీ ప్రశ్నించలేదు.
కానీ బిజెపి ఇటీవల తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సమావేశంలో మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తింది. తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో పాటు మజ్లిస్ పార్టీని కూడా తెలంగాణపై టార్గెట్ చేయాలని సూచించింది. ఇప్పుడు తెలంగాణపై మజ్లిస్ వర్సెస్ బిజెపి యుద్ధంగా సాగుతోంది. హిందూ దేవతలపైన, హిందువుల పైన అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు ముస్లిం వర్గాలను రెచ్చగొట్టి తద్వారా బిజెపికి ఆ పార్టీ తెలంగాణ వాదనకు వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశ్యమే కావచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications