ఇంగ్లాండ్లో అక్బర్: అసద్, మమ్మల్నితిట్టండి కానీ: కిషన్
మమ్మల్ని తిట్టండి...
భారతీయ జనతా పార్టీ పైన కోపం ఉంటే మజ్లిస్ పార్టీ నేతలు తమను విమర్శించాలి లేదా తిట్టాలి, అంతేకానీ హిందూ దేవతలను తిడితే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్కు తమ పార్టీ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఢీకొట్టే సీన్ లేదన్నారు. ఈ నెల 8న బిజెపి కోర్ కమిటీ సమావేశమవుతుందన్నారు. మజ్లిస్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ చేపడతామన్నారు.
తెలంగాణను అడ్డుకునేందుకే మజ్లిస్ పార్టీ ఇలా కొత్తగా తెరపైకి మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తీసుకు వచ్చిందన్నారు. మతకల్లోహాలు సృష్టించి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం మజ్లిస్ పార్టీ చేస్తోందన్నారు. త్వరలో తామంతా రాష్ట్రమంతా పర్యటిస్తామని చెప్పారు. మజ్లిస్ దురాగతాలను అందరికీ తెలియజేస్తామన్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని ముస్లిం వర్గాలకు వారి గురించి తెలిసి వచ్చేలా చేస్తామన్నారు.
ఒకరు ఇలా మరొకరు అలా
హిందువులను బతకనివ్వమని అక్బరుద్దీన్ అనడం దుర్మార్గమని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒకరు మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే మరొకరు శిలువ గుర్తుతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. ఆ రెండు పార్టీల గుర్తింపును రద్దు చేయాలన్నారు. అక్బరుద్దీన్కు పిచ్చి ముదిరిందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదన్నారు.